Tuesday, December 28, 2010

ఆహ్లాదంగా ఆనందంగా సుందర వనంలోరచయిత్రులు..

Posted by Mantha Bhanumathi on Tuesday, December 28, 2010 with 3 comments




అబ్బో! ఎప్పట్నుంచో అనుకుంటున్నాం వనభోజనానికి వెళ్దామని. కార్తీక మాసం వానలతో వరదలతో అలా గడిచిపోయింది. "ఆలస్యం అయినా ఫర్లేదు.. అసలు మానద్దు" అనే సామెతలాగా (మీరు ఊహించినట్లు ఇది ఇంగ్లీష్ నుంచి కాపి కొట్టిందే). మొన్న ఆదివారం ప్రగతి రిజార్ట్స్ కి వెళ్లాలని అనుకున్నాం. ఇరవై రెండు మంది అనుకున్నది పన్నెండు మంది వచ్చారు.

పొద్దున్నే తొమ్మిదికి బయలుదేరాలని.. కొంచెం అటు ఇటుగా అరగంట లేటుగా బయల్దేరారు త్యాగరాయ గానసభ దగ్గిర పొత్తూరి విజయలక్ష్మిగారి ఆధ్వర్యంలో, వాసా ప్రభావతి, ఇంద్రగంటి జానకీబాల, శీలా సుభద్రాదేవి, గంటి భానుమతి, శ్రీవల్లి రాధిక, ఉంగుటూరి శ్రీలక్ష్మి బస్ ఎక్కారు. మధ్యలో జెయన్టియు దగ్గిర నేను, శాంతసుందరి, వారణాసి నాగలక్ష్మి, సోమరాజు సుశీల, తురగా జానకీరాణి ఎక్కాము.

"ఆకలేస్తే ఎవర్ని అడగాలి" శ్రీవల్లి రాధిక సందేహం. "బస్సేక్కించే వరకే నేను.. ఆ తరువాత అంతా మంథాదే బాధ్యతా." పొత్తూరి నొక్కి చెప్పేశారు. "అసలు మీకు ఆ సమస్యే ఉండదు. డొక్కా సీతమ్మగారి వారసులం మేము" అంటూ అందరికి చాక్లెట్లు పంచాను.


"ఇంకా రాదేవిటి.." అంటూ ఎవరో దీర్ఘాలు "అదిగో అల్లదిగో.. " అంటూ నేను చెప్పిన అరగంటకి, పదకొండున్నరకి ప్రగతికి చేరాం.

అక్కడ ఆహ్వానించడానికి రామకృష్ణగారు (ప్రగతిలో ఒక డైరెక్టర్), ఉన్నారు. వెళ్తూనే చల్లని పానీయం ఇచ్చి పావుగంటలో అల్పాహారం ఇస్తాం.. ఈలోగా కొంత వ్యాహ్యాళి చెయ్యండి అన్నారు. అలాగే కమ్మని సాండ్విచ్ లు, ఫ్రెంచ్ ఫ్రైలు, కాఫీ ఇచ్చారు. మేము కొంచెం ఆయాసం తీర్చుకుంటూ ఉండగానే ప్రగతి చైర్మన్ రావుగారు, భార్య, ఇంకొక డైరెక్టర్ రజని, కొంతమంది స్టాఫ్ శ్రీనివాస్, ప్రవీణ్ వచ్చారు. రావుగారు గంటన్నరసేపు ఆయుర్వేదా మొక్కలు, వృక్షాలు.. వాటి పెంపకాలు.. ప్రగతి ఆశయాలు, వృద్ధాశ్రమాలు.. వంటివి అన్నీ వివరిస్తూనే ఉన్నారు.. భోజనం తయార్ అన్నారు.


రావుగారు వెళ్ళగానే (వినీ వినీ.. గంటన్నర క్రితం తిన్నవే అరిగిపోయాయి.) పళ్ళాలు తీసేసుకున్నాం. నేను రెండు పదార్ధాలలో అల్లం-వెల్లుల్లి, ఉల్లి వాడద్దంటే అన్నింటిలోను మానేసి.. (మరీ వాటి ధరలెలా ఉన్నాయ్? ఆనందంగా మానేసారు) జైన్ వంటకాలు చేసారు. చెప్పద్దు.. చాలా బాగున్నాయి.. సాత్వికాహారం. పైగా మాలో నాగలక్ష్మి, శ్రీవల్లి రాధిక తప్ప అందరం బామ్మలం/అమ్మమ్మలం . హాయిగా ఉంది.


ఒక గంటసేపు సాహిత్య చర్చలు అయ్యాక.. (అవేమిటో అడగద్దు.. వంటలు గుర్తున్నట్లుగా సాహిత్యం గుర్తుండదు, అదేమిటో! కొంచం అందర్నీ అడిగి మళ్లీ రాస్తాను. ) మళ్లీ వనంలో విహారం. అందరు తెగ మెచ్చుకున్నారు.. వనాన్ని , నన్ను కూడా.. నేనే లెండి అక్కడికి వెళ్దామని ఏర్పాట్లు చేసింది. చెట్లు ఉన్నాయా.. ఒక్క దోమ కానీ, ఈగ కానీ నుసాము కానీ లేవు. అంతా మెడిసినల్ వృక్షాల ప్రభావంట.


మళ్లీ బగ్గిలు(చిన్న బాటరీ కార్లు) బస్సు ఎక్కి, నర్సరికి వెళ్ళాం. అక్కడ బస్సు దిగుతూనే అందరం ఆనంద పడిపోయాం. ప్రతి చెట్టునుంచి సువాసన.. నిమ్మగడ్డి, సబ్జా, పుదినా తులసి, కర్పూర తులసి, కృష్ణ తులసి.. ఏదో లోకం లోకి వెళ్ళిపోయాం.. ఆ వాసనలు పీల్చి, ఇంకోసారి రావుగారి వెంచర్ అంతా చూసి, అక్కడే నివాసముంటున్నసోమరాజు సుశీల గారికి స్నేహితులు, మధుసూదనరావుగారి ఇంటికి వెళ్ళాం. అదొక పెద్ద విల్లా.. ఒక మినీ ప్రగతిలా ఉంది. చూడగానే అక్కడ ఇళ్ళు కట్టేసుకుందామని ఆవేశం వచ్చేసింది.


కమ్మని కబుర్లు అయ్యాక నవగ్రహవనం చేరాం. అక్కడే మాకు కుర్చీలు ఏర్పాటు చేసారు. నవగ్రహాలకి ఇష్టులైన వ్రుక్షాలున్నాయి. వాటికింద, మళ్లీ బోండాలు , మిరపకాయ బజ్జీలు తిని, కాఫీ, హెర్బల్ టి తాగి బస్సు దగ్గరికి వచ్చాం. మరీ అతిథులకి పళ్ళు ఇవ్వాలికదా వీడ్కోలుతో.. అందరికి అప్పుడే తోటలోంచి కోసిన జామకాయలు, కృష్ణతులసి మొక్కలు ఇచ్చారు రజనిగారు.

అంత తిరిగినా అస్సలు అలిసిపోకుండా ఇళ్ళకి చేరాం. కాకపొతే పాటలు పాడుకోలేకపోయాం.. ఇంద్రగంటి, శీలా గార్లు అద్భుతంగా పాడతారు. వచ్చేసారికి అవి..

Saturday, November 27, 2010

అమ్మో! చలి..

Posted by Mantha Bhanumathi on Saturday, November 27, 2010 with No comments


అమ్మో! చలి..

తప్పించు కోవాలంటే ఒకటే మార్గం. హైదరాబాద్ వెళ్ళడమే!

అందుకనే ప్రయాణం పది రోజులు ముందుకి జరిపేసి ఎల్లుండి విమానం ఎక్కేస్తున్నాం.

వసంత కాలం, వేసంకాలం లండన్ ఎంతో చక్కగా ఉంటుంది. కన్నుల విందు చేసే చెట్లు.. రంగు రంగుల పూలూ అడుగడుగునా కనిపించే పార్కుల్లో స్వాగతం పలుకుతుంటాయి. అమెరికాలో కూడా అంతే.. కానీ ఇక్కడయితే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికయినా హాయిగా మనం ఎవర్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్లిపోవచ్చు.

రెండు నెలలు ఆహ్లాదంగా గడిచి పోయాయి.

మళ్లీ వచ్చే ఏడు వస్తామని వీడ్కోలు తీసుకుంటున్నాము అందరి దగ్గరా..

Thursday, November 18, 2010

అనుబంధం అంటే ఇదేనా..

Posted by Mantha Bhanumathi on Thursday, November 18, 2010 with 6 comments
అనుబంధం అంటే ఇదేనా..
ఈ కాలంలో లండన్లో ఎముకలు కోరికే చలి.. బయటికి వెళ్ళాలంటే.. తలుచుకుంటేనే వణుకు. అయినా ఎన్ని రోజులని ఇంట్లో కూర్చుంటాం?
ఎలాగో మూడో నాలుగో తొడుగులు తగిలించి మొన్న పొద్దున్నే బయట పడ్డాం నేను, మావారు.
అలా సౌత్ హాలు కేసి వెళ్తే మన బీరకాయలు, వంకాయలు లాంటివి తెచ్చు కోవచ్చని, అక్కడే వేడి వేడిగా సోమోసాలు, పానిపురి లాంటివి తినేస్తే మధ్యాన్నం ఇంటికొచ్చి పడుక్కోవచ్చని ప్లాన్.
బస్ ఎక్కి మంచి సీటు దొరికితే.. కిటికీ లోంచి షాపులన్నీ చూసుకుంటూ తీరుబడిగా వెనక్కి వాలి కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. గంట పైన ప్రయాణం. కంగారేం లేదు.
తరువాతి స్టాప్ లో బస్ కదల బోతుండగా చెయ్యి చెయ్యి పట్టుకుని ఇద్దరు దంపతులు మెల్లిగా ఎక్కారు. 85 సంవత్సరాలు పైనే ఉంటుంది వయసు. ఒకరి కొకరు ఆసరా ఇచ్చుకుంటూ లోపలి వచ్చారు, కార్డ్లు రెండు మెషిన్ కి చూపించి వస్తుంటే ముందు సిట్లో కూర్చున్న కుర్రాడు లేచి పెద్దావిడ్ని కూర్చో పెట్టాడు. పక్కన అంతే వయసున్న ఇంకో ఆవిడుంది మరి.. తాతగారికి వెనుక సీటు చూపించి సహాయం చెయ్యబోయాడు లేచిన కుర్రాడు.
అబ్బే! అదేం కుదరదు.. తాతగారు తన స్వీట్ హార్ట్ పక్కనే కడ్డీ పుచ్చుకుని నిలబడ్డారు. ఆవిడ చెయ్యి ఇంకో చేతిలో ఉంచుకుని. అటుపక్క సీటులో ఉన్న మేము లేచి వాళ్ళిద్దర్నీ మా సీట్లలో కూర్చోపెట్టి మేము వేరే సర్దుకున్నాం. ఇద్దరి బుగ్గలు ఎర్రగా ఆపిల్ పళ్ళలా ఉన్నాయి. మొహాల్లో పసిపిల్లల అమాయకత్వం. కిటికిలోంచి చూసే ప్రతీది వివరించుకుంటూ వాళ్ళు చేసే ప్రయాణం ఎంతో ముచ్చటగా అనిపించింది మాకు.
జీవితాంతం తోడుగా నిడగా ఉండడం అంటే ఇదేనా అనిపించింది. ఇదో మరపురాని అనుభూతి.

Sunday, October 24, 2010

నిజమే.. మీరు చెప్పినట్లు..

Posted by Mantha Bhanumathi on Sunday, October 24, 2010 with 2 comments
పాతిక ముఫ్ఫై ఏళ్ళ క్రితం.. ఆకాశవాణి మేలుకొలుపుతో రోజు మొదలయ్యేటప్పుడు..
మధ్యలో ఒక టింగ్..టింగ్.. తరువాత ఒక ప్రకటన. అందులో వచ్చేది..
"నిజమే.. మీరు చెప్పినట్లు యాస్‍బెస్టాస్ రేకులనే వాడతాము.. మా తాతగారు వేయించిన రేకులు.. ఇప్పటికీ.."
ఆ ప్రకటనలన్నీ అందరి నోళ్ళలోనూ నానుతూ ఉండేవి.
ఆ తరువాత కొన్నేళ్ళకి యాస్బెస్టాస్ రేకులు వాడితే కాన్సర్ వస్తుందని కనుక్కుని.. వాటిని నిషేధించారు..(నిజంగానా! ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి మరి, భారతదేశంలో..)
ఈ మధ్యన ఎక్కడ పడితే అక్కడ గ్రనైట్ రాళ్ళు.. రంగురంగుల డిజైన్లతో, కళ్ళు మిరిమిట్లు గొలిపే రంగులతో.. ఆధునిక భవంతులన్నిటిలోనూ కన్నులు విందులు చేస్తున్నాయి. నున్నగా.. ఆదమరిచి అడుగేస్తే జారి నడుము విరిగేట్లు.. ఎయిర్‍పోర్టుల్లోనూ.. పెద్ద పెద్ద మాల్స్ లోనూ, హోటల్స్‍లోనూ.. "ఇందుగలడందులేడనే" స్థంభాల్లోనూ.. అన్ని చోట్లా!
మరి ఈ రాళ్ళ తవ్వకాల్లో జరిగే అవకతవకలు అనేకానేక స్కాముల్లో కొన్ని.
ఇంతకీ మనం పట్టించుకోవలసిందేవిటీ అంటే..
ఈ అందాల రాళ్ళు అత్యధిక రేడియో ధార్మిక శక్తి కలిగి ఉన్నాయని. హైద్రాబాదులోని అధిక సంపన్నులుండే జుబిలీహిల్స్‍లో అత్యధికంగా రేడియో ధార్మిక శక్తి విడుదల అవుతోందిట.
మధ్యతరగతి ప్రజలు కూడా కనీసం వంటింట్లోనైనా.. వేయించుకుంటే అని కలలు కంటుంటారు.
ఇంతకీ మా వంటింట్లో వేయించిన రాళ్ళమీద పోర్టబుల్ గీగెర్-ముల్లర్ కౌంటర్ (రేడియో ధార్మిక కణాలని.. బీటా, గామా మొదలగు వాటిని కొలిచేది) పెడితే అది కుయ్.. కుయ్ అని ఆపకుండా మొత్తుకుంది.
వీటి వాడకం ఎంతవరకూ.. మానవజాతి, జంతుజాలాలు భరించగలిగే పరిధిలోనే ఉందా!
జియాలజిస్టులు దీనిమీద దృష్టి పెట్టి నిజానిజాలు వెల్లడిస్తే బాగుండును.
ఈ రేడియోధార్మిక కణాలు కాన్సర్ రావడానికి కారణాలు అని ఎప్పుడో నిరూపించారు.

తొలి పలుకు

Posted by Mantha Bhanumathi on Sunday, October 24, 2010 with 6 comments
అందరికీ వందనములు.
బ్లాగర్ల ప్రపంచంలోకి తొలి అడుగు వేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రోత్సహించిన డెట్రాయిట్ నారాయణస్వామి గారికి ధన్యవాదాలు.
ఇండియానాపోలిస్ లో జరిగిన వంగూరి-గీతా వారి సాహిత్య సభల్లో నారాయణస్వామి ఇచ్చిన ప్రసంగం స్ఫూర్తితో మొదలు పెట్టాను. ఇంక నా మనసులో మాటలు బ్లాగర్లు అందరితో పంచుకోగలుగుతున్నందుకు ఆనందంగా ఉంది.
ఇందులో వివిధ రంగాలలోని ప్రతిభాశాలురతో పరిచయం ఏర్పడుతుందనీ, విజ్ఞానం పెరుగుతుందనీ ఆశిస్తున్నాను.